Revanth Reddy: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్తో మేలు 8 d ago

TG: రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా స్కూల్లోని క్లాస్ రూమ్లను, బెంచ్లను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హోంగార్డు నుంచి డీజీపీ వరకు పిల్లలను ఈ స్కూల్లో చేర్పించవచ్చని, పోలీసు పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని తెలిపారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకే యంగ్ ఇండియా స్కూల్ను ప్రారంభించామని, స్కిల్ యూనివర్సిటీల్లో చదివిన వారికి ఉద్యోగ భద్రత ఉంటుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు.. పిల్లల చదువులపై దృష్టి పెట్టలేరని, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అత్యంత ముఖ్యమైనదని చెప్పారు.
ప్రతి సీఎంకు ఒక బ్రాండ్ ఉంటుందన్నారు. కిలో రూ.2కే బియ్యం పథకం అంటే ఎన్టీఆర్, ఐటీ అంటే చంద్రబాబు, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్ గుర్తొస్తారని పేర్కొన్నారు. ఉద్యమాన్ని తమ బ్రాండ్గా కొందరు చెప్పుకుంటున్నారని, కానీ నా బ్రాండ్ యంగ్ ఇండియా అని పేర్కొన్నారు సీఎం రేవంత్. చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్లో మెడల్స్ సాధిస్తున్నాయన్నారు, భారత దేశం ఎందుకు మెడల్స్ సాధించలేకపోతోందని, దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశానికి ఎన్ని పతకాలు వచ్చాయని ప్రశ్నించారు. ఏటా లక్షలాది మంది బీటెక్ పూర్తి చేస్తున్నారని, విద్యార్థుల్లో నాణ్యత ఎంతంటే ఎవరి వద్ద సమాధానం లేదని పేర్కొన్నారు.